మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష
అమరావతి : రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధికి సంబంధించిన డీ-స్కోపింగ్ ప్రతిపాదనలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం, అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమర్థంగా వినియోగించడంతో పాటు అవసరమైన చోట అదనపు సౌకర్యాలు కల్పించడంపై సమావేశంలో చర్చ జరిగింది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, వైద్య సేవలు అందించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని మంత్రి సూచించారు.
వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్య సీట్లకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకం కింద చేపడుతున్న పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. ఆయా కళాశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులు, అవసరమైన మౌలిక వసతులు, ప్రస్తుత స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పౌర నిర్మాణ పనులకు అవుతున్న వ్యయం, ప్రతిపాదిత పనుల అవసరం, ఇప్పటికే అందుబాటులో ఉన్న వసతుల పరిస్థితిపై అధికారులు సమగ్రంగా వివరించారు. అవసరంలేని పనులను తగ్గించి, అత్యవసరమైన మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిధులు సమర్థంగా వినియోగించేలా పనుల ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు.
వైద్య కళాశాలల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పనుల విషయంలో జాప్యం జరగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణ పనుల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర పురోగతి నివేదికను అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య విద్య, వైద్య సేవలకు అవసరమైన మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
