అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. శనివారం ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండా గ్రామంలో టీబీ రహిత గిరిజన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డా.సాధన, ప్రోగ్రామ్ అధికారి సుమలత, అదనపు డీఎంహెచ్వో మనోహర్, డీఆర్డీవో రవీందర్, ప్రోగ్రామ్ అధికారి సుమలత, సర్పంచ్ రోహిదాస్, పిరమల్, స్టాప్ టీబీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లు, గ్రామస్థులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిర ప్రచార వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రోగులకు నిక్షయ్ మిత్ర కిట్లను పంపిణీ చేయడంతో పాటు, మెడికల్ ఆఫీసర్ సరస్వతిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పిరమల్ ఫౌండేషన్ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా (ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో) మూడు బ్లాకుల్లో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మిగతా బ్లాక్స్కు సైతం దీన్ని విస్తరిస్తామన్నారు. ఈ ప్రత్యేక శిబిరంలో అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడుతున్నాయని, ప్రజలు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ గ్రామాల్లోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ పూర్తిగా నయమవుతుందని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని భరోసా కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టిబి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు.
