హైదరాబాద్ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి): రిమ్స్ ఆదిలాబాద్లో సెమీ అటానమస్ విధానం, జీఓ నంబర్ 99 నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు వైద్యులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రిమ్స్ కాంట్రాక్ట్ వైద్యుల సంఘం ప్రతినిధులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో డాక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ సందీప్ జాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ నాగరాజ్, డాక్టర్ సంజయ్ గావలే, డాక్టర్ రవీందర్, డాక్టర్ సింధూర తదితరులు ఉన్నారు. రిమ్స్ లో వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. రిమ్స్ కు సెమీ అటానమస్ హోదా ఉన్నప్పటికీ సంబంధిత నిబంధనలు, జీఓ నంబర్ 99ను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు వివరించారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, నిబంధనల అమలులో స్పష్టత లేకపోవడం వంటి అంశాల కారణంగా పలువురు వైద్యులు రిమ్స్ ను వీడుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.వైద్యులు రిమ్స్ ను వీడటంతో స్పెషలిస్ట్ వైద్య సేవలపై ప్రభావం పడుతోందని, దీనివల్ల ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని డీఎంఈకి వివరించారు.రిమ్స్ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని నిర్వహించి సమస్యలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు. సెమీ అటానమస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి, వైద్యులకు మెరుగైన ఉద్యోగ భద్రత కల్పిస్తే రిమ్స్లో మరింత మంది నిపుణులైన వైద్యులు చేరేందుకు, కొనసాగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.వైద్యులకు అవసరమైన భద్రత, స్పష్టమైన నిబంధనలు కల్పించడం ద్వారా రిమ్స్ లో వైద్యుల సంఖ్య పెరగడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.వైద్యుల సమస్యలను ఓపికగా విని, సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణికి కాంట్రాక్ట్ వైద్యుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి డీఎంఈ సానుకూలంగా స్పందించడంతో వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.డీఎంఈని కలిసిన వారిలో డాక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ సందీప్ జాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ నాగరాజ్, డాక్టర్ సంజయ్ గావలే, డాక్టర్ రవీందర్, డాక్టర్ సింధూర తదితరులు ఉన్నారు.
